Viral Video: లక్నో ఓటమి.. మైదానంలోనే కెప్టెన్ పంత్‌పై యజమాని గోయెంకా ఆగ్రహం.. మరోసారి రిపీటైన కేఎల్ రాహుల్ ఎపిసోడ్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే కెప్టెన్ రిషభ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో తీవ్రంగా చర్చిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గోయెంకా ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఓటమి అనంతరం అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో గోయెంకా ఇలాగే బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన సంఘటనను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 141 పరుగులకే కుప్ప‌కూలి నిరాశపరిచింది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ రాణించడంతో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయం సాధించింది.

ఓటమి అనంతరం రిషభ్ పంత్ మాట్లాడుతూ... బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. "కొత్త బంతితో పిచ్ బౌలర్లకు సహకరించింది, కానీ మేము భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమయ్యాం. 140 పరుగుల వంటి తక్కువ స్కోరు చేసినప్పుడు, బౌలర్లు ఒత్తిడికి గురవడం సహజం. పవర్‌ప్లేలో మరికొన్ని వికెట్లు తీసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. తక్కువ పరుగులు ఉన్నప్పుడు, బ్యాటర్లతో బౌలింగ్ చేయించడం వంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది" అని పంత్ అన్నాడు.

లక్నో బౌలర్లు ఆరంభంలో ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను పతుమ్ నిస్సంకను అవుట్ చేయడమే కాకుండా, అక్షర్ పటేల్‌ను ఒక అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, స్వల్ప లక్ష్యం కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చారు. తన వికెట్ గురించి అడిగినప్పుడు, "దాని గురించి ఆలోచించకపోవడమే మంచిది. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే వెనుకబడిపోతాం" అని పంత్ వ్యాఖ్యానించాడు.
Viral Video
Rishabh Pant
Sanjeev Goenka
Lucknow Super Giants
Delhi Capitals
IPL 2024
KL Rahul
Justin Langer
Cricket
LSG vs DC
Indian Premier League

More Telugu News