Masoud Pezeshkian: హత్య బెదిరింపుల మధ్య జనంలోకి ఇరాన్ అధ్యక్షుడు.. అమెరికాకు హెచ్చరిక

ఇరాన్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. దేశాధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం ఓ ర్యాలీలో నేరుగా ప్రజల మధ్యకు వచ్చారు. హత్యాయత్నాల ముప్పు పొంచి ఉన్నప్పటికీ, కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేకుండా వారు జనంతో కలిసిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

"ఇస్లామిక్ రిపబ్లిక్ డే" వేడుకల్లో భాగంగా టెహ్రాన్ వీధుల్లో జరిగిన ఈ ర్యాలీలో అధ్యక్షుడు పెజేష్కియాన్, మంత్రి అరాఘ్చీ ప్రజలతో మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల మధ్యకు రావడం ద్వారా వారి నుంచి స్ఫూర్తి పొందడానికి, ఈ ఐక్యతను ఆస్వాదించడానికి వచ్చానని విదేశాంగ మంత్రి అరాఘ్చీ వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఆ దేశ ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లరిజానీ కూడా ఇలాగే బహిరంగంగా కనిపించిన కొన్ని రోజులకే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే... యూరోపియన్ కౌన్సిల్ అధిపతితో ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్ మాట్లాడారు. ఈ ఘర్షణకు ముగింపు పలికేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, మళ్లీ ఇలాంటి దాడులు పునరావృతం కావనే గ్యారెంటీ ఇవ్వడం వంటి ప్రాథమిక షరతులను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతవారం అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికకు కౌంటర్‌గా ఇరాన్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇరాన్ శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ నేతలను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగిస్తే, ఇవాళ్టి నుంచి గూగుల్, యాపిల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలపై ప్రతీకార దాడులకు దిగుతామని ప్రకటించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Masoud Pezeshkian
Iran
Abbas Araghchi
Iran president
Islamic Republic Day
Iran US tensions
IRGC
Iran Revolutionary Guard
Google
Apple

More Telugu News