Leander Paes: బెంగాల్ ఎన్నికల ముంగిట... బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

భారత టెన్నిస్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత లియాండర్ పేస్ తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో పేస్ బీజేపీలో చేరాడు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఉన్న పేస్, ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ సమక్షంలో లీండర్ పేస్ కాషాయ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 1996 ఒలింపిక్స్‌లో పేస్ కాంస్య పతకం సాధించిన చారిత్రక క్షణాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో గాయంతో ఆడుతూ ఆండ్రీ అగస్సీ చేతిలో ఓడిపోయినప్పుడు తానెంతో బాధపడ్డానని చెప్పారు. ఒలింపిక్ పటంలో భారత్‌కు గుర్తింపు తెచ్చిన పేస్, ఇప్పుడు బీజేపీ వేదికగా దేశానికి సేవ చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీలో చేరిన అనంతరం లియాండర్ పేస్ భావోద్వేగానికి గురయ్యాడు. "గడిచిన 40 ఏళ్లుగా క్రీడాకారుడిగా దేశం తరఫున ఆడాను. డేవిస్ కప్, ఒలింపిక్స్ వంటి ఎన్నో టోర్నీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చాను. ఇప్పుడు నా సోదరులు అప్పగించిన బాధ్యతతో ఒక కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశానికి, ముఖ్యంగా యువతకు సేవ చేయాలనుకుంటున్నాను" అని తెలిపాడు. ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

లియాండర్ పేస్ 2021లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరినప్పటికీ, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బెంగాల్‌లో టీఎంసీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీకి, పేస్ వంటి ప్రముఖుడి చేరిక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పేస్ పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
Leander Paes
BJP
West Bengal
Indian Tennis
Kiren Rijiju
Sukanta Majumdar
TMC
Narendra Modi
Amit Shah
2026 Elections

More Telugu News