Sourav Ganguly: కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్ (బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ) వేదికల ఎంపికపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ఈడెన్ గార్డెన్స్లో టెస్టు మ్యాచ్ జరగకపోవడం పట్ల బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకు కొంత నిరాశ ఉన్నప్పటికీ, బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఒక మాజీ క్రికెటర్గా కోల్కతాలో మ్యాచ్ జరగాలని నేను కోరుకుంటాను. కానీ, కేవలం సంప్రదాయ వేదికలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మైదానాలకూ అవకాశం ఇవ్వడం ముఖ్యం" అని గంగూలీ అన్నారు. గువాహటి, రాంచీ వంటి నగరాల్లో టెస్టులు నిర్వహించడం వల్ల అక్కడి అభిమానులకు మేలు జరుగుతుందని, ప్రస్తుతం దేశంలోని అన్ని స్టేడియాల్లోనూ ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
2001లో ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకున్న దాదా, ఆనాటి ఆటగాళ్లంతా మళ్లీ ఒక చోట చేరాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. "మేమంతా ఈ నెలలోనే కలవాల్సి ఉంది. అయితే సచిన్ టెండూల్కర్ కుమారుడి (అర్జున్ టెండూల్కర్) వివాహం ఉండటంతో ఆ భేటీని వాయిదా వేశాం. త్వరలోనే ఆ వేడుక ఎప్పుడనేది ప్రకటిస్తాం" అని ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తన కెరీర్లో లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన నాట్వెస్ట్ ట్రోఫీ విజయం కంటే.. కోల్కతా, అడిలైడ్, హెడింగ్లేలలో సాధించిన టెస్టు విజయాలే తనకు ఎక్కువ సంతృప్తినిస్తాయని గంగూలీ చెప్పారు. పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ గురించి చెబుతూ... "300 పరుగుల దగ్గర సింగిల్ తీయమని నేను చెప్పినా వినకుండా, వీరూ సిక్స్తోనే దాన్ని పూర్తి చేశాడు. త్రిశతకాలు తరచూ రావు, అందుకే అప్పుడు నేను కాస్త కంగారు పడ్డాను" అని నవ్వుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నాగ్పుర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్లు బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.