Vangalapudi Anitha: కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏ మంచి పనికైనా వైసీపీ క్రెడిట్‌ను దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న విజయనగరంలో పర్యటించిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం హయాంలో 70 శాతం పూర్తయిందని మంత్రి అనిత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు వచ్చినా పాలకులకు వాటాలు, కమీషన్లపైనే దృష్టి ఉండేదని, భోగాపురం ఎయిర్‌పోర్టే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. ఇప్పుడు అలాంటి అవినీతికి తావులేకపోవడంతోనే ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతున్నాయని వివరించారు.

ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై ఆమె ప్రశ్నలు సంధించారు. అమరావతిపై కౌన్సిల్‌లో తీర్మానం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నిస్తున్నారని, అసలు అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టంగా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, తన పర్యటనలో భాగంగా మంత్రి అనిత విజయనగరం సబ్-జైలు, గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
 
Vangalapudi Anitha
Andhra Pradesh
TDP
YCP
Vizianagaram
Moolapeta Port
Bhogapuram Airport
Amaravati
Andhra Pradesh Home Minister
AP Politics

More Telugu News