Vijaya Shanti: వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి

తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఉండేవారా అని శాసనమండలి ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వారి తరఫున విజయశాంతి మండలిలో తన గళం వినిపించారు.

పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు వివిధ సందర్భాలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

ఉద్యమకారుల విషయంలో ఈ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తే, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలుస్తుందని అన్నారు. లేదంటే చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Vijaya Shanti
Telangana
Telangana Activists
Telangana Formation
MLC Vijaya Shanti
Telangana Government

More Telugu News