Vaibhav Suryavanshi: ఈ ఐపీఎల్ సీజన్‌లో తన గోల్ ఏంటో చెప్పిన వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌పై తన లక్ష్యాన్ని స్పష్టం చేశాడు. 2008లో తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన తర్వాత మళ్లీ ట్రోఫీకి దూరమైన తమ జట్టుకు ఈసారి ఎలాగైనా కప్ అందించడమే తన ప్రధాన ధ్యేయమని అన్నాడు. ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన వైభవ్, అదే ఉత్సాహంతో ఐపీఎల్‌లో రాణించాలని చూస్తున్నాడు.

ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ, "ఈ సీజన్‌లో జట్టు కోసం ట్రోఫీ గెలవడమే నా లక్ష్యం. మేము ట్రోఫీ గెలిస్తే నా ప్రదర్శన, జట్టు ప్రదర్శన వాటంతట అవే హైలైట్ అవుతాయి. అదే అత్యంత ముఖ్యం" అని తెలిపాడు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేసిన వైభవ్, అందులో ఒక ఇన్నింగ్స్ లో 35 బంతుల్లోనే సెంచరీ బాదడం విశేషం. "పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలనుకుంటున్నా. ఒకసారి కుదురుకుంటే వికెట్ చేజార్చుకోకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాను" అని వివరించాడు.

తన చిన్ననాటి హీరోలు బ్రియాన్ లారా, యువరాజ్ సింగ్ తనపై ఎంతో ప్రభావం చూపారని వైభవ్ గుర్తుచేసుకున్నాడు. "లారా, యువరాజ్ ఒంటిచేత్తో మ్యాచ్‌లను ముగించడం చూశాను. వారు క్రీజులో ఉంటే ప్రత్యర్థికి గెలిచే అవకాశం ఉండేది కాదు. వారిలోని ఆ లక్షణం నాకు బాగా నచ్చింది" అని చెప్పాడు. బీహార్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో రాణించడం ద్వారా అండర్-19 జట్టుకు, ఆ తర్వాత రంజీ ట్రోఫీకి ఎంపికయ్యానని, అప్పటి నుంచే రాజస్థాన్ రాయల్స్ స్కౌటింగ్ బృందం తనను గమనిస్తోందని వైభవ్ పేర్కొన్నాడు.

సింగిల్ ఎందుకు సార్ అనే వాడు!: కోచ్ మనీశ్ ఓఝా

వైభవ్ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా మాట్లాడుతూ, అతనికి చిన్నప్పటి నుంచే దూకుడుగా ఆడే నైజం ఉందని అన్నాడు. "ఒక బంతికి సిక్స్ కొట్టే అవకాశం ఉంటే, సింగిల్ ఎందుకు తీయాలి సార్? అని అడిగేవాడు. రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్‌లో భాగంగా ఒక ఓవర్‌లో 24 పరుగులు చేయాలని టార్గెట్ ఇస్తే, కేవలం ఐదు బంతుల్లోనే దాన్ని పూర్తి చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు" అని గుర్తుచేసుకున్నాడు. అతని నిర్భయమైన బ్యాటింగ్ శైలే అతనికి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కేలా చేసిందని ఓఝా తెలిపాడు.


Vaibhav Suryavanshi
Rajasthan Royals
IPL 2026
IPL
Indian Premier League
Under 19 World Cup
Brian Lara
Yuvraj Singh
Manish Ojha
Cricket

More Telugu News