Beijing bulldozer incident: బీజింగ్‌ మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. జనంపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి.. వీడియో ఇదిగో!

చైనా రాజధాని బీజింగ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బుల్‌డోజర్‌తో రద్దీగా ఉండే మార్కెట్‌ లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాడు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దుండగుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డాడని వీడియోలో కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్ జిల్లాలో ఉన్న దహాంజీ మార్కెట్ నిత్యం జనంతో కిటకిటలాడుతుంటుంది.

శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు పసుపు రంగు బుల్‌డోజర్‌తో మార్కెట్ లోపలికి ప్రవేశించాడు. తొలుత భద్రతా చెక్ పోస్టును బద్దలుకొట్టి, నేరుగా జనంపైకి వాహనాన్ని నడిపాడు. దుకాణాలను నేలమట్టం చేస్తూ, మనుషులను తోక్కిస్తూ ముందుకు సాగాడు.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతను ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో కనీసం 8 మంది మరణించి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, మృతుల సంఖ్యపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Beijing bulldozer incident
Beijing
bulldozer attack
China
Dahangji Market
Fangshan district
market attack
China incident
Beijing market

More Telugu News