Iran: సొరచేపలకు ఆహారంగా వేస్తాం... అమెరికాకు ఇరాన్ వార్నింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి నెల రోజులు గడిచిన నేపథ్యంలో, ఇరాన్ తాజాగా అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్‌లోకి అమెరికా సైన్యాన్ని పంపితే, వారు ‘సొరచేపలకు ఆహారంగా’ మారతారని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఈ అవకాశం కోసం తమ సైనికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని పేర్కొంది.

ఇరాన్ సైన్యం నిన్న విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో, ఆ దేశ ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ‘ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస’ అని, ‘ప్రపంచంలోనే అత్యంత అసత్యాలు పలికే అధ్యక్షుడు’ అని అభివర్ణించారు. ఆయన నిర్ణయాల్లో స్థిరత్వం లేదని, ఒక క్షణం చర్చలంటూనే మరుక్షణం యుద్ధానికి సిద్ధమవుతారని విమర్శించారు. జెఫ్రీ ఎప్‌స్టిన్‌ కేసుకు సంబంధించిన పాత సంబంధాల కారణంగా ట్రంప్‌పై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.

మరోవైపు, ఇరాన్‌లోని ఖార్గ్ దీవి, హర్మూజ్ జలసంధి సమీపంలో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వస్తున్నాయి. దీనికోసం భారీ ఎత్తున సైన్యాన్ని వ్యూహాత్మక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్‌ కూడా స్పందించారు. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. భూతల దాడికి ప్రయత్నిస్తే అమెరికాకు ఘోర పరాజయం తప్పదని ఇరాన్ పునరుద్ఘాటించింది.
 
Iran
America
US Iran tensions
Persian Gulf
Israel
Donald Trump
Military conflict
Middle East crisis
Kahrg Island
Hormuz Strait

More Telugu News