Revanth Reddy: అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’.. ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పౌష్టికాహార లోపాన్ని రూపుమాపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. 'తొలిముద్ద' పేరుతో అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద అంగన్వాడీ చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం ఉప్మా, కిచిడీ వంటి రెడీ-టు-కుక్ మిక్స్ తో కూడిన అల్పాహారం అందిస్తారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఆహార భద్రత ఉందని, కానీ అందరికీ పౌష్టికాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డ, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు సమతులాహారం అందితేనే వారి మానసిక ఎదుగుదల సక్రమంగా ఉంటుందని, ఈ లోపం కారణంగానే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.

'తొలిముద్ద' పథకం విజయవంతం కావడంలో అంగన్వాడీ టీచర్లదే కీలక పాత్ర అని సీఎం పేర్కొన్నారు. చిన్నారులను సొంత బిడ్డల్లా భావించి, వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అద్దె భవనాల్లో కాకుండా, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana
Anganwadi
Toli Mudda
Nutrition
Children Nutrition
Paushtikaharam
Infant Nutrition
Konda Surekha
Seethakka

More Telugu News