RCB: చిన్నస్వామి స్టేడియంలో... తొక్కిసలాట మృతుల స్మారకార్థం ఖాళీ సీట్లు... ఫొటో ఇదిగో!

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌కు ముందు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు, గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు నివాళులర్పించారు. ఇరు జట్ల ఆటగాళ్లు, అధికారులు, అభిమానులు ఒక నిమిషం మౌనం పాటించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

గౌరవసూచకంగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆర్సీబీ ఆటగాళ్లు వార్మప్ సమయంలో '11' నంబర్ ఉన్న జెర్సీలను ధరించి అభిమానుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వాహకులు తమ 'ఎక్స్' ఖాతాలో, "గతేడాది జూన్ 4న ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఆర్సీబీ అభిమానులకు నివాళి. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు.

గతేడాది ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా స్టేడియం వెలుపల జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలో క్రికెట్‌ను నిలిపివేశారు. దీనివల్ల 2025 మహిళల వన్డే ప్రపంచకప్, 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌తో పాటు పలు దేశీయ టోర్నీలకు బెంగళూరు ఆతిథ్యం కోల్పోయింది.

వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్ సీఏ), ప్రేక్షకుల నిర్వహణ, స్టేడియం మౌలిక సదుపాయాల్లో భారీ మార్పులు చేసింది. అభిమానుల జ్ఞాపకార్థం స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విషాదం తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చిన్నస్వామిలో జరుగుతున్న తొలి ప్రధాన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా, మరణించిన 11 మంది అభిమానుల గౌరవార్థం స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా వారికి కేటాయించారు.



RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
IPL 2026
Stampede
Cricket
Sunrisers Hyderabad
Bengaluru
KSCA
Venkatesh Prasad

More Telugu News