Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి కన్స్ట్రక్షన్స్ సంస్థపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్స్ట్రక్షన్స్' శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్ను నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీ సాక్షిగా ధ్వజమెత్తారు. సర్వే నంబర్ 62, 63లలో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోందని ఆయన ఆరోపించారు. మైనింగ్ శాఖ నోటీసులు ఇచ్చినా, లేఖలు రాసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి అరెస్టును ప్రస్తావిస్తూ హరీశ్ రావు ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. చిన్న తప్పు చేశారనే నెపంతో మహిపాల్ రెడ్డి తమ్ముడిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారని, మరి అంతకంటే పెద్ద అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి సంస్థపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. "అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా?" అని మండిపడ్డారు.
తన ట్వీట్లపై మంత్రి పొంగులేటి 'మొరిగే కుక్కలు' అంటూ చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. అక్కడ కాంగ్రెస్ జెండాలు ఉన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అది కచ్చితంగా పొంగులేటి సంస్థేనని స్పష్టం చేశారు. ఆయన మంత్రి పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, అందుకే వెంటనే రాజీనామా చేసి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. "నేను చెప్పేవి అబద్ధాలైతే నన్ను ఉరి తీయండి లేదా ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయండి. ఒకవేళ నేను చెప్పేవి నిజాలైతే మాత్రం వెంటనే రాఘవ కన్స్ట్రక్షన్స్పై కఠిన చర్యలు తీసుకోవాలి" అని సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్తో అసెంబ్లీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.