ఎన్టీఆర్ అవార్డు నగదును విరాళంగా ప్రకటించిన మెగాస్టార్
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను మెగాస్టార్ చిరంజీవి అర్థవంతంగా నిర్వహించారు. ఆడంబరాలకు పోకుండా సమాజానికి మేలు చేసేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చిరంజీవిని ఎన్టీఆర్ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో పాటు అందిన 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఆయన తన సొంతానికి వాడుకోకుండా, ఐదు వేర్వేరు సేవా సంస్థలకు విరాళంగా అందజేశారు. తన సుదీర్ఘ సామాజిక సేవా ప్రస్థానంలో భాగంగా ఈ మొత్తాన్ని సమాజ సేవకే అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ విరాళాల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ను కలిసిన కొందరు వృద్ధాశ్రమ వాసులు, ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. వారి కోరికను మన్నించి, చిరంజీవి సుమారు 30 మంది వృద్ధులను తన బ్లడ్ బ్యాంక్కు ఆహ్వానించారు. వారికి కొత్త బట్టలు పంపిణీ చేయడమే కాకుండా, స్వయంగా విందు భోజనం ఏర్పాటు చేసి చరణ్ పుట్టినరోజును వారికి చిరస్మరణీయంగా మార్చారు.