తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న నేతృత్వంలోని 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' (TRP) ఈ యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేవలం ఒక నిరసనగా కాకుండా, బీసీలకు, వెనుకబడిన తరగతులకు రాజకీయ అధికారం దక్కాలనే ప్రధాన అజెండాతో ఈ యాత్ర సాగనుంది.
గ్రామగ్రామాన పర్యటించి బీసీల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, రాజకీయ సాధికారతకు అవసరమైన మద్దతను కూడగట్టడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగనుంది. జూన్ 2న ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఏ జిల్లా నుంచి యాత్ర మొదలవుతుంది, ఏయే దశల్లో ఎన్ని కిలోమీటర్లు సాగుతుంది అనే పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.