Rahul Ramakrishna: సోదరుణ్ణి కోల్పోయా.. ఆ గడ్డి మందును బ్యాన్ చేయండి: నటుడు రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna Calls for Paraquat Ban After Brothers Death
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి చేశారు. అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ అనే కలుపు (గడ్డి) మందును తక్షణమే నిషేధించాలని ఆయన కోరారు. మార్కెట్లో సులభంగా దొరుకుతున్న ఈ విష రసాయనం కారణంగా తాను తన సోదరుణ్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యలకు సులభమైన మార్గంగా మారిందని, ఎందరో ప్రాణాలను బలిగొంటోందని చెబుతూ తెలంగాణ సీఎంవో, ప్రధానమంత్రి కార్యాలయాలను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు.

పారాక్వాట్ అనేది పొలాల్లో కలుపు మొక్కలను నాశనం చేయడానికి రైతులు విరివిగా ఉపయోగించే ఒక రసాయనం. ముఖ్యంగా పత్తి వంటి మెట్ట పంటలు, వరి పొలాల గట్ల మీద పెరిగే గడ్డిని తొలగించడానికి దీనిని వాడతారు. తక్కువ ధరకే లభించడంతో దాదాపు ప్రతి రైతు ఇంట్లోనూ ఇది అందుబాటులో ఉంటోంది. అయితే, ఇదే అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. క్షణికావేశంలో ఇంట్లో గొడవలు పడినవారు లేదా ఇతర సమస్యలతో బాధపడేవారు దీనిని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఈ కలుపు మందు అత్యంత విషపూరితమైనది కావడంతో కొద్ది మోతాదులో తాగినా ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ఆవేశం తగ్గాక బతకాలని వేడుకున్నా, వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని, శరీరంలోని కీలక అవయవాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు వివరిస్తున్నారు. ఈ విషం చర్మంపై పడినా, వాసన పీల్చినా ప్రమాదకరమే.

ఈ మందు తాగి తెలంగాణలో ఏటా 6 వేల మంది వరకు చనిపోతున్నారని అంచనా
తెలంగాణలో పారాక్వాట్ తాగి ఏటా సుమారు 5,500 నుంచి 6,000 మంది చనిపోతున్నారని అంచనా. దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 1000 కేసులు నమోదవుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ‘డాక్టర్స్ ఎగైనెస్ట్ పారాక్వాట్ పాయిజన్’ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కనీసం మండల వ్యవసాయ అధికారి సిఫార్సుతో, ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని పలువురు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Rahul Ramakrishna
Paraquat
Herbicide
Pesticide Ban
Suicide Prevention
Telangana
Indian Medical Association
Doctors Against Paraquat Poison
Pest Control
Farmers

More Telugu News