విశాఖలో తీవ్ర కలకలం.. 60 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సును నడిపిన ఆగంతుకుడు!

విశాఖపట్నంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి, ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఆర్టీసీ బస్సును సుమారు కిలోమీటర్ దూరం నడపడంతో అందులోని వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం వెళ్లేందుకు  60 మంది ప్రయాణికులతో బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరింది. కొన్ని నిమిషాల్లోనే స్థానిక ఎల్ఐసీ భవనం వద్దకు రాగానే, టికెట్ల కోసం డ్రైవర్ పి.ఏ. రావు బస్సును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగారు. కండక్టర్ వి.ఎస్. లక్ష్మి బస్సులో టికెట్లు ఇస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి డ్రైవర్ సీట్లోకి ఎక్కి బస్సును నడపడం ప్రారంభించాడు. డ్రైవర్ మారిన విషయాన్ని ప్రయాణికులు మొదట గమనించలేదు. అయితే, బస్సు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే రూట్‌లో వెళ్తుండటంతో అనుమానం వచ్చి చూడగా, డ్రైవింగ్ సీట్లో అపరిచిత వ్యక్తి ఉండటాన్ని చూసి ఉలిక్కిపడ్డారు.

వెంటనే ప్రయాణికులంతా భయంతో గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో కంగారుపడిన ఆ వ్యక్తి, ముందు వెళ్తున్న కారును స్వల్పంగా ఢీకొట్టాడు. పూర్ణ మార్కెట్ వద్ద ప్రయాణికులు, స్థానికులు కలిసి బస్సును బలవంతంగా ఆపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాంప్లెక్స్ పరిసరాల్లో యాచిస్తూ జీవనం సాగించే కిశోర్ గా గుర్తించారు. అతడిని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
 
 


More Telugu News