బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు

అనంతపురం జిల్లాలో దారుణ హత్యకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తన బావమరిది అయిన చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసులో నిందితుడైన సర్వేష్‌కుమార్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపైనే దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. యాడికి మండలం కోన ఉప్పలపాడు శివార్లలోని ఘాట్ రోడ్డు వద్ద హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు సర్వేష్‌కుమార్‌ను పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీరు బాటిల్‌ను పగలగొట్టి సీఐ రామసుబ్బయ్య, ఇతర సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. పోలీసులు గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి హెచ్చరించినా అతడు వెనక్కి తగ్గలేదు. దీంతో సీఐ రామసుబ్బయ్య తన సర్వీస్ రివాల్వర్‌తో నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో నిందితుడు సర్వేష్‌కుమార్‌తో పాటు సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, అప్పుల్లో కూరుకుపోయిన సర్వేష్‌కుమార్.. వాటిని తీర్చేందుకు డబ్బు కోసం తన మామను బెదిరించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో  25వ  తేదీన పాఠశాల నుంచి వస్తున్న తన బావమరిది హేమచంద్ర (7)ను కిడ్నాప్ చేశాడు. అయితే, పోలీసులకు దొరికిపోతాననే భయంతో బాలుడిని గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని కొండల్లో పడేశాడు.


More Telugu News