సీఎంపై వ్యాఖ్యలు: జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన భట్టిప్రోలు పోలీసులు, తాజాగా విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఆయనకు నోటీసులు పంపారు.

కాగా, జోగి రమేశ్‌పై గత నెలలో కూడా మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, జన సమూహాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై సెక్షన్ 30 యాక్ట్ కింద ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 


More Telugu News