కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది, 5 సీబీఐ కేసులు కూడా పెట్టింది: సబితా ఇంద్రారెడ్డి
- కాంగ్రెస్ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతానని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి తన గురించి కామెంట్ చేయనంత వరకు తాను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదని వెల్లడి
- కేసులు పెట్టినా, టిక్కెట్ ఇవ్వకున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదన్న సబితా ఇంద్రారెడ్డి
సీతక్క... కేసీఆర్ కుటుంబాన్ని, తనను పదేపదే తిడుతున్నారని ఆరోపించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషపడతారేమో... అందుకే తమను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని విమర్శించారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తన మీద రేవంత్ రెడ్డి కామెంట్ చేసేవరకు తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మేం సేవలు చేయలేదా అని ప్రశ్నించారు. పార్టీ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని దెబ్బతీయడానికి తనపై ఐదు సీబీఐ కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ రోజు తాను ఒక్కమాట మాట్లాడలేదని అన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వని సమయంలోనూ మాట్లాడలేదని తెలిపారు.
వ్యక్తిగతంగా తమను లక్ష్యంగా చేసుకోవడానికి వారికి చాలా వేదికలు ఉన్నాయని, కానీ శాసనసభలో ప్రజాసమస్యలపై మాట్లాడుదామని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి తన గురించి మాట్లాడారని, అందుకే తాను కాంగ్రెస్ గురించి మాట్లాడవలసి వస్తోందని అన్నారు.