పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు రాజుకున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన కెప్టెన్ల రౌండ్ టేబుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కరాచీ కింగ్స్ సారథి డేవిడ్ వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న ఈ సమావేశంలో క్రమశిక్షణ లోపించిందంటూ ఆయన బహిరంగంగానే మండిపడ్డారు.


అసలేం జరిగిందంటే.. ప్రెస్ మీట్‌లో వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి సీరియస్‌గా వివరిస్తుండగా.. పక్కనే కూర్చున్న ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ ఒకరితో ఒకరు సరదాగా ముచ్చటించుకుంటూ నవ్వుకుంటున్నారు. తన మాటలను వారు పట్టించుకోకపోవడంతో వార్నర్ సహనం కోల్పోయారు. "ఇక్కడ ఏం జరుగుతోంది? క్షమించండి.. ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నట్లున్నారు. వీళ్లు తమను తాము 'ప్రీమియం ప్లేయర్స్' అని పిలుచుకుంటున్నారు కానీ, వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల్లా ఉంది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎలా ఉండాలో కూడా వీరికి తెలియదా?" అంటూ ఘాటుగా విమర్శించారు.


వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు వార్నర్ పద్ధతిని కొందరు తప్పుబడుతుండగా, మరికొందరు మాత్రం అంతర్జాతీయ ప్రెస్ మీట్లలో ప్రొఫెషనలిజం ఉండాల్సిందేనని వార్నర్‌కు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా వార్నర్ లాంటి సీనియర్ ప్లేయర్ మాట్లాడుతున్నప్పుడు తోటి ఆటగాళ్లు గౌరవం ఇవ్వకపోవడం సరైనది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News