Revanth Reddy: హైదరాబాద్‌కు సరికొత్త విజన్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Revanth Reddy Announces Telangana Rising 2047 Vision for Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ 2047' అనే బృహత్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన, నగరాభివృద్ధిపై ప్రభుత్వ దార్శనికతను, చేపట్టబోయే ప్రాజెక్టులను వివరించారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ వంటి తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నాయని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూస్తామని ఆయన అన్నారు.

తెలంగాణను క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ప్యూర్ (మాన్యుఫ్యాక్చరింగ్ హబ్), రేర్ (అగ్రికల్చర్) అనే మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలించి, ఆ భూములను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనివల్ల నగరం మరింత నివాసయోగ్యంగా మారుతుందని వివరించారు. హైదరాబాద్‌ను రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులతో అనుసంధానించే రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకున్నామని గుర్తుచేశారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. రోడ్లను అండర్‌పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే కింద అండర్‌పాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు సాధించామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. మెట్రో విస్తరణకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు.

మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధిపై సీఎం కీలక ప్రకటన చేశారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడం ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన పనులను తాము ముందుకు తీసుకెళుతుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. సూచనల కోసం అవసరమైతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని వేస్తామని ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనుల వల్ల ఏ ఒక్కరినీ నిరాశ్రయులను చేయబోమని, మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా, అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించి, చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. సుపరిపాలనతో పాటు స్మార్ట్ గవర్నెన్స్‌పై దృష్టి సారించి, హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Rising 2047
Hyderabad development
Musi River
Metro Rail expansion
Begumpet Airport
Traffic solutions
Outer Ring Road
Urban planning
Telangana

More Telugu News