టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర.. 81 బంతుల్లో 193 బాదిన గుజరాత్ బ్యాటర్!

గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువ క్రికెటర్ ఆర్య దేశాయ్ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సూరత్‌లో జరిగిన ఓ టోర్నమెంట్‌లో కేవలం 81 బంతుల్లోనే 193 పరుగులు సాధించి సంచలనం రేపాడు. టీ20ల్లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో ఆర్య పేరు మారుమోగిపోతోంది.

గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) గుర్తింపు పొందిన 'సూరత్ క్రికెట్ టీ20 లీగ్'లో ఆర్య దేశాయ్ ఈ అసాధారణ ఘనతను అందుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఏకంగా 21 ఫోర్లు, 14 భారీ సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీ ఆరో సీజన్‌కు చేరుకోగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు.

ఆర్య దేశాయ్ గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గుజరాత్ తరఫున రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ స్కోరును జీసీఏ సెక్రటరీ అనిల్ పటేల్ ధ్రువీకరించారు. "అతడు బంతిని బాదిన తీరును నేను ఎప్పుడూ చూడలేదు. గత రంజీ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీతో పాటు ఇండియా అండర్-23 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉంది" అని అనిల్ పటేల్ ప్రశంసించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్య దేశాయ్ మరోసారి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.


More Telugu News