యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాం: శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార

మార్చి నెల ప్రారంభంలో శ్రీలంకలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలను దిగడానికి అనుమతించాలని అమెరికా కోరగా, అందుకు నిరాకరించామని శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే ఆ దేశ పార్లమెంటుకు తెలిపారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో శ్రీలంక తటస్థ వైఖరి అనుసరిస్తోంది. ఈ క్రమంలో యుద్ధ విమానాలను దింపడానికి అనుమతించాలని అమెరికా విజ్ఞప్తి చేయగా శ్రీలంక తిరస్కరించింది.

ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పార్లమెంటుకు తెలిపారు. మార్చి 4 నుంచి 8 తేదీల మధ్య జిబూటీలోని ఒక స్థావరం నుంచి రెండు క్షిపణి సామర్థ్యం కలిగిన విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించేందుకు అమెరికా అనుమతి కోరిందని అనురకుమార తెలిపారు. కానీ అమెరికా అభ్యర్థనను తిరస్కరించామని వెల్లడించారు.

ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తటస్థ వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని అన్నారు. పశ్చిమాసియా యుద్ధం ఎన్నోసవాళ్లను విసురుతోందని, అయినప్పటికీ ఏ పక్షానికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. జిబూటీలోని ఒక స్థావరం నుంచి 8 యాంటీషిప్ మిసైల్స్‌తో కూడిన రెండు యుద్ధ విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా భావించిందని అన్నారు.


More Telugu News