రూ.16,000 కోట్ల భారీ ఆఫర్‌కు నో.. ఐపీఎల్ విలువను మార్చేసిన రాజస్థాన్ రాయల్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల విలువకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు వచ్చిన 1.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,000 కోట్లు) భారీ ఆఫర్‌ను యాజమాన్యం తిరస్కరించింది. అమెరికా, కెనడాలలో కార్యకలాపాలు సాగించే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్టనర్స్ (సీపీసీపీ) ఈ బిడ్‌ను దాఖలు చేసింది. రెండు వారాల్లోనే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చినా, రాజస్థాన్ రాయల్స్ బోర్డు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు.

అధిక విలువ కోసం రాజస్థాన్ రాయల్స్ వ్యూహం 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేవలం అధిక విలువను ఆశించడమే కాకుండా ఒప్పందం అమలు తీరు (ఎగ్జిక్యూటబిలిటీ)పై ఉన్న సందేహాల వల్లే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీసీపీ కన్సార్టియం తరఫున వ్యవస్థాపక భాగస్వాములైన నిషా సచ్‌దేవా, దేబ్‌జీత్ గుప్తా ఈ డీల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మాత్రం కేవలం డబ్బును మాత్రమే కాకుండా ఒప్పందం యొక్క నిర్మాణం, నిశ్చయత్వం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఆఫర్‌ను తిరస్కరించింది.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌లో మనోజ్ బదాలేకు చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్‌కు 65 శాతం వాటా ఉండగా, రెడ్‌బర్డ్ క్యాపిటల్ వంటి సంస్థలకు మైనారిటీ వాటాలు ఉన్నాయి. ఇంత భారీ ఆఫర్‌ను తిరస్కరించడం ద్వారా తమ ఫ్రాంచైజీ విలువ ఇంకా ఎక్కువేనని యాజమాన్యం మార్కెట్‌కు స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రస్తుతం అమ్మకందారులదే పైచేయిగా ఉన్న మార్కెట్‌లో తమకు అత్యధిక ప్రయోజనం కలిగే వరకు వేచి చూడాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.

రాజస్థాన్ దెబ్బకు పెరగనున్న ఆర్సీబీ విలువ? 
ఈ నిర్ణయం ప్రభావం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అమ్మకం ప్రక్రియపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల వాల్యుయేషన్ అంచనాలు మారిపోయాయి. ఆర్‌సీబీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్, భారీ అభిమాన గణం, వాణిజ్యపరమైన ఆకర్షణ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కంటే కనీసం 15 శాతం అధిక విలువ పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పాయ్, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్, సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్‌సీబీలో వాటా కొనుగోలు రేసులో ముందున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేవలం క్రికెట్ జట్లుగా కాకుండా ప్రపంచస్థాయి క్రీడా ఆస్తులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను కేవలం వారి ఆర్థిక బలం ఆధారంగా కాకుండా, ఫ్రాంచైజీ విలువను పెంచగల వారి సామర్థ్యాన్ని బట్టి కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఐపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకాల సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.


More Telugu News