నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను: మంత్రి నారా లోకేశ్

తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది సంబరాలు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు దేవాన్ష్‌తో కలిసి పూజలు చేస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు.

"నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను" అంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ కొత్త ఏడాదిలో చేదు అనుభవాలు తగ్గి, తీపి జ్ఞాపకాలు ఎక్కువగా ఉండాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా తన కఠినమైన డైట్‌ను ఒక రోజు పక్కన పెట్టి, పండగ భోజనాన్ని ఆస్వాదించబోతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం లోకేశ్ పంచుకున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెటిజన్లు లోకేశ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అటు, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి కూడా తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "తెలుగు వారందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం అంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందం గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన సంస్కృతి. కష్టాన్ని సుఖాన్ని సమభావంతో తీసుకోవాలనే ఆలోచనకు వేదిక. మన తొలి పండుగ అయిన ఉగాది మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. 


More Telugu News