యాక్షన్ మోడ్‌లో ఆది సాయి కుమార్.. ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ అదిరింది!

టాలీవుడ్‌ యంగ్ హీరో ఆది సాయి కుమార్ తన కొత్త సినిమా టైటిల్‌ను ఉగాది పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ‘ఈగో రాజా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌తో ఆది కోలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఉగాది కానుకగా విడుదలైన ‘ఈగో రాజా’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఒంటిపై గాయాలు, రక్తం మరకలతో చుట్టూ రౌడీలు ఉండగా, చేతిలో సిగరెట్ పట్టుకుని ఆది సాయి కుమార్ చాలా అగ్రెసివ్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే, సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదని స్పష్టమవుతోంది. యాక్షన్, ఎమోషన్, మాస్ అంశాల కలబోతగా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన గురు శరవణన్, ‘కూగల్ కుట్టప్ప’ చిత్రంతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తన మూడో చిత్రమైన ‘ఈగో రాజా’తో హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘శంబాల’తో మంచి విజయం అందుకున్న ఆది సాయి కుమార్, ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులను కూడా పలకరించనున్నారు. ‘కంజూరింగ్ కన్నప్పన్’, ‘సట్టం ఎన్ కైయిల్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు సతీశ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటం విశేషం. స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు చూస్తుండగా, విలక్షణ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. దురైరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.



More Telugu News