ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న వేళ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ను పురస్కరించుకుని రేపు ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలిడే)ను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


వాస్తవానికి, ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఐచ్ఛిక సెలవును తొలుత మార్చి 13న ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, రంజాన్ మాసపు చంద్రదర్శనం, పండుగ కాలాన్ని నిశితంగా పరిశీలించిన తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు... సెలవును మార్చి 20కి మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ సిఫారసును పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (GAD), గతంలో ఉన్న తేదీని సవరిస్తూ మార్చి 20 నాడు (రేపు) సెలవును ఖరారు చేసింది. జుమాతుల్ విదా రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసుకునే ముస్లిం ఉద్యోగులకు ఈ ఐచ్ఛిక సెలవు ఎంతగానో ఉపయోగపడనుంది.



More Telugu News