లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు

సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన అక్రమ కేసుల విషయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లతో తనను 18 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచేలా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు గత తీర్పులకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్ చెబితేనే తనను కోర్టులో ప్రవేశ పెట్టారని మండిపడ్డారు.


తనను లాకప్‌లో ఉంచిన సమయంలో పోలీసులు శారీరక, మానసిక హింసకు గురిచేశారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని అంబటి అన్నారు. తన నివాసం, వాహనాల మీద ఏడు గంటల పాటు దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని, కానీ దాడి చేసిన వారికి మాత్రం వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ధ్వజమెత్తారు.


రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం పవన్ కల్యాణ్ కి మాత్రమే పరిమితమైందని... సామాన్య ప్రజలకు, ప్రతిపక్షాలకు ఇది 'ఆటవిక పాలన'గా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చనే అరాచక వాతావరణం నెలకొందని అంబటి దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఎంతదూరమైనా వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు.


More Telugu News