ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-5 వన్డే బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్

వన్డేలో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్-5లో ఉన్న ముగ్గురు భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (2వ ర్యాంకు), రోహిత్ శర్మ (4వ ర్యాంకు), శుభ్‌మన్ గిల్ (5వ ర్యాంకు)లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్‌దీప్ యాదవ్ ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు.

పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను గెలిపించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలర్ల జాబితాలో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరాడు. భారత బౌలర్ల నుంచి కుల్‌దీప్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో మిరాజ్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకులో నిలిచాడు. టీమిండియా ఆటగాడు అక్షర్ పటేల్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. జట్లపరంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉంది.

టీ20 ర్యాంకింగ్ విషయానికి వస్తే బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకును మెరుగుపరుచుకొని టాప్-5లోకి వచ్చాడు. మొదటి రెండు స్థానాల్లో రషీద్ ఖాన్ (753 పాయింట్లు), వరుణ్ చక్రవర్తి (740) నిలిచారు. బుమ్రా 702 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకాడు.

భారత ఎడమచేతివాటం బ్యాటర్లు అభిషేక్ శర్మ (875), ఇషాన్ కిషన్ (871) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. తిలక్ వర్మ 742 పాయింట్లతో ఒక ర్యాంకు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. సంజు శాంసన్ ఒక ర్యాంకును మెరుగుపరుచుకుని 21వ స్థానంలోకి వచ్చాడు. ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, హార్దిక్ పాండ్యా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.


More Telugu News