Nara Lokesh: దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Dines with Differently Abled Individuals
షార్ట్స్‌లో చూడండి
దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ ప్రయాణించారు.

అనంతరం ఉండవల్లి నివాసంలో 'దివ్యాంగ శక్తి పథకం' లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి లోకేశ్, తన పక్కన కూర్చొన్న శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతీ కలిపారు. వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దివ్యాంగుల గౌరవం పెంచాలని, వారిలో పట్టుదల ఎక్కువ అని అన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. వికలాంగుల ఆత్మగౌరవం ముఖ్యమని లోకేశ్ పేర్కొన్నారు. సమాజంలో కూడా మహిళలను కించపరిచే పదాలను అందరూ విడనాడాలని, ఇందుకోసం తాను పోరాడుతున్నానని అన్నారు.

ప్రతి ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల

"కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం. ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల చేస్తున్నాం. ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ కేలండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రావడం ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కల్పన జరగుతుంది. అందుకే అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. మంగళగిరిలో ప్రభుత్వ భూమి లభ్యత చాలా తక్కువగా ఉంది. అందుకే కాజా వద్ద 75 ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నాం. మంగళగిరికి 4,5 ఐటీ కంపెనీలను తీసుకువస్తాం. సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుంది" అని లోకేశ్ తెలిపారు. 

అమెరికా వెళ్లడం నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం

స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని లోకేశ్ అన్నారు. స్త్రీలు ఎవరిపై ఆధారపడకూడదని అభిప్రాయపడ్డారు. ఇంటర్ తర్వాత అమెరికా వెళ్లడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయమని తెలిపారు. అందుకే నా సొంత కాళ్లపై నిలబడగలిగానని, దాదాపు 8 ఏళ్లు నేను అమెరికాలో ఉన్నానని వెల్లడించారు. చదువుతో పాటు ఉద్యోగం చేశానని, దీంతో తనకు ఎంతో అవగాహన వచ్చిందని అన్నారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల యోగక్షేమాలను, ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధిని ఈ సందర్భంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ అందుకున్న తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్, సీఎం సందేశం వస్తున్నాయా అని వాకబు చేశారు. తమ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రభుత్వంలో అన్నివిధాల అండగా ఉంటామని మంత్రి లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.
Go Back to Shorts
Nara Lokesh
Divyang Shakti
Disabled Welfare
Andhra Pradesh Government
Chandrababu Naidu
Pawan Kalyan

More Telugu News