పాక్‌కు ఆఫ్ఘ‌న్ క్రికెటర్ హెచ్చరిక.. భారత్ సాయం చేయాలని విజ్ఞప్తి

ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్నర్, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న అల్లా గజన్ఫర్.. కాబూల్‌లో జరిగిన వైమానిక దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన, చరిత్ర పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలవాలని కోరాడు.

కాబూల్‌లోని 2,000 పడకల డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై జరిగిన వైమానిక దాడిలో సుమారు 400 మంది మరణించగా, 250 మంది గాయపడినట్లు ఆఫ్ఘ‌న్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు. ఈ దాడి పాకిస్థాన్ పనేనని ఆఫ్ఘ‌నిస్థాన్ ఆరోపించగా, పాక్ ప్రభుత్వం దీనిని ఖండించింది.

ఈ ఘటనపై న్యూస్18తో మాట్లాడుతూ గజన్ఫర్ భావోద్వేగానికి గురయ్యాడు. "ఆ ఆసుపత్రిలో చికిత్స కోసం డబ్బులు కూడా లేని నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. అలాంటి వారిని కూడా లక్ష్యంగా చేసుకుని చంపేశారు. దీన్ని ఆఫ్ఘ‌నిస్థాన్ ప్రజలు అంగీకరించరు. ఈ దాడులతో వాళ్లు ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని అన్నాడు.

"ఆఫ్ఘ‌నిస్థాన్ చరిత్ర అందరికీ తెలుసు. ఒకవేళ ఆ చరిత్ర పునరావృతమైతే, అది పాకిస్థాన్‌కు చాలా చెడ్డది" అని గజన్ఫర్ హెచ్చరించాడు. భారత్ తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశమని, ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వివాదాలు ఎవరికీ మంచివి కావని, ప్రపంచం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు.


More Telugu News