సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR Letter to Revanth Reddy on Fee Reimbursement Scheme
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపణ
  • సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటైన బహిరంగ లేఖ
  • జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • 10 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పథకానికి ఎసరు పెడుతున్నారని విమర్శ
  • విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని అన్నారు. సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరని ఆయన హెచ్చరించారు.

రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చారని కేటీఆర్ తన లేఖలో తీవ్రస్థాయిలో విమర్శించారు. "ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ. దీనివల్ల 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇది నిరుపేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే వెన్నుపోటు చర్య" అని కేటీఆర్ అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కొనసాగించిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకానికి గ్రహణం పట్టిందని విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా సుమారు 10 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను చెల్లించలేదని, ఇప్పుడు విద్యార్థుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తామంటే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో 2500కు పైగా కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. నిధులు అడిగిన వారిని వన్-టైమ్ సెటిల్మెంట్, టోకెన్ల పేరుతో మభ్యపెట్టారని, నిరసన తెలిపితే విజిలెన్స్ దాడులతో బెదిరించారని ఆరోపించారు.

ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే గురుకులాల్లో 142 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికీ వేలాది మంది సరైన భోజనం లేక ఆసుపత్రుల పాలవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకవైపు 3.75 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు మాత్రం ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం దుర్మార్గం. రైతుబంధును మూడుసార్లు ఎగ్గొట్టి రైతులను దగా చేశారు. ఇప్పుడు ఫీజుల పథకానికి మంగళం పాడేందుకు దొడ్డిదారులు వెతుకుతున్నారు" అని కేటీఆర్ దుయ్యబట్టారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కేటీఆర్ హెచ్చరించారు. "ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలి. లేదంటే 14 లక్షల మంది విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తాం. ఇప్పటికే రైతుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. దీనికి విద్యార్థుల ఆగ్రహం కూడా తోడైతే ముఖ్యమంత్రి, మంత్రులు రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుంది" అని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana Fee Reimbursement
Telangana Politics
Congress Government
BRS Party
Education System
Student Protests
GO 7

More Telugu News