సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ

టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రపంచకప్ టోర్నీ ముగిశాక హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చిన తిలక్ వర్మ, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎటీజీ) చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిలక్ వర్మ విజయం రాష్ట్రానికి గర్వకారణమని, ఆయన ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 


More Telugu News