జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎల్ రమణతో కలిసి పనిచేశానని, ఇప్పుడు జీవన్ రెడ్డితో కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ రమణ వంటి వారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. అలాంటి తప్పిదాల వల్లనే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాలేదని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనప్పటి నుంచి పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తన వర్గానికి తక్కువ సీట్లు ఇచ్చి, సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ టిక్కెట్లు కేటాయించారని ఆరోపించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో సంజయ్ కుమార్ పైవిధంగా స్పందించారు.


More Telugu News