పుంగనూరులో విషాదం.. బైక్ పొగకు ఊపిరాడక తాత, ముగ్గురు చిన్నారుల మృతి

అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మెకానిక్ ఇచ్చిన సలహా పాటించడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బైక్ ఇంజిన్ నుంచి వెలువడిన పొగను పీల్చి తాత, ముగ్గురు మనవళ్లు మృతి చెందిన ఈ ఘటన పట్టణంలోని త్యాగరాజు వీధిలో శనివారం రాత్రి జరిగింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. త్యాగరాజు వీధికి చెందిన మురళి తన ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేయించాడు. ఇంజిన్ సమస్య ఉండటంతో మెకానిక్, రాత్రంతా బైక్‌ను ఆన్‌లో ఉంచాలని సూచించాడు. దీంతో మురళి ఇంట్లోనే బైక్‌ను ఆన్ చేసి ఉంచి, తలుపులు మూసేశాడు. ఆ సమయంలో మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్‌, కవల కుమార్తెలు చరిత, చందన కింద గదిలో నిద్రిస్తుండగా.. మురళి, అతడి భార్య రేవతి పైగదిలో పడుకున్నారు.

ఇల్లు ఇరుకుగా ఉండి, గాలి సరిగా ఆడే వీలు లేకపోవడంతో బైక్ నుంచి వెలువడిన పొగ గది మొత్తం వ్యాపించింది. ఈ పొగను పీల్చడంతో ఊపిరాడక తాత, మనవడు, మనవరాళ్లు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. పైగదిలో ఉండటంతో మురళి, రేవతి దంపతులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కళ్లముందే కన్నబిడ్డలు, తండ్రి విగతజీవులుగా పడి ఉండటంతో వారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


More Telugu News