Chandra Kumar Bose: ఎర్రకోట మ్యూజియంలో ఉన్న నేతాజీ టోపీ ఒరిజినల్ లాగా అనిపించడం లేదు: చంద్రకుమార్ బోస్

Chandra Kumar Bose Doubts Authenticity of Netaji Cap in Red Fort Museum
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ఉన్న నేతాజీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన టోపీ అసలైనది కాదేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

చంద్రకుమార్ బోస్ కథనం ప్రకారం, 2019లో నేతాజీ ధరించిన అసలైన టోపీని తమ కుటుంబ సభ్యులు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఎర్రకోటలో ఏర్పాటు చేస్తున్న మ్యూజియంలో దానిని భద్రపరచాలని విజ్ఞప్తి చేయగా, ప్రధాని అంగీకరించారు. మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆ టోపీని ఒక గాజు పెట్టెలో ఉంచి ప్రదర్శనలో పెట్టారు.

అయితే, ఆ తర్వాత ఆ టోపీని ప్రదర్శనల కోసం దేశంలోని వేర్వేరు మ్యూజియంలకు పంపారని, ఇటీవల అది తిరిగి ఎర్రకోట మ్యూజియంకు చేరిందని తెలిసింది. కానీ, ప్రస్తుతం అక్కడ ప్రదర్శనలో ఉన్న టోపీ, తాము ఇచ్చిన అసలైన టోపీలా కనిపించడం లేదని చంద్రకుమార్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయడంతో పాటు ఎక్స్ లో కూడా పోస్ట్ చేసినట్లు తెలిపారు.

"ప్రస్తుతం అక్కడ ఉన్న టోపీ ప్రామాణికతను నిర్ధారించాలి. మేము ఇచ్చిన అసలైన టోపీకి, దీనికి తేడా కనిపిస్తోంది. అందుకే దీనిపై తప్పనిసరిగా విచారణ జరగాలి" అని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ గతంలోనే జోక్యం చేసుకున్నారని, ఇప్పుడు కూడా దర్యాప్తునకు ఆదేశించి అసలు వాస్తవాలను నిగ్గు తేల్చాలని తమ కుటుంబం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చంద్రకుమార్ బోస్ పేర్కొన్నారు.
Chandra Kumar Bose
Netaji Subhas Chandra Bose
Red Fort Museum
Netaji cap
Indian history
নেতাজি সুভাষচন্দ্র বসু
নেতাজি ক্যাপ
Narendra Modi
নেতাজি মিউজিয়াম
India

More Telugu News