అబ్రహాం లింకన్‌ యుద్ధనౌకపై దాడి అవాస్తవం.. ఇరాన్ ప్రచారాన్ని ఖండించిన అమెరికా

  • యూఎస్ నౌక అబ్రహాం లింకన్‌ను ధ్వంసం చేశామన్న ఇరాన్
  • ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా, ఇది ప్రచార యుద్ధమని వెల్లడి
  • నౌక సురక్షితంగా ఉందని ఫొటోలు, వీడియోలు విడుదల చేసిన యూఎస్ సైన్యం
అమెరికాకు చెందిన విమాన వాహక యుద్ధనౌక 'యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్'‌పై దాడి చేశామని ఇరాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ఇరాన్ వాదనలను అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం ఓ ప్రచార యుద్ధంలో భాగమని స్పష్టం చేస్తూ, నౌక సురక్షితంగా ఉన్నట్లు ఆధారాలు విడుదల చేసింది.

ఇటీవల తమ క్షిపణి, డ్రోన్ దాడుల్లో 'అబ్రహాం లింకన్' నౌకకు భారీ నష్టం వాటిల్లిందని, అది యుద్ధరంగం నుంచి వెనుదిరిగిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా కొట్టిపారేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు కనీసం నౌకకు సమీపంలోకి కూడా రాలేదని స్పష్టం చేసింది. దీనికి రుజువుగా, నౌక సముద్రంలో సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫొటోలు, వీడియోలను అమెరికా విడుదల చేసింది.

ఇదిలా ఉండగా, ఇటీవల అబ్రహాం లింకన్ నౌకకు అత్యంత సమీపంగా వచ్చిన ఓ ఇరాన్ నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ప్రమాదకరంగా దగ్గరికి రావడంతో హెచ్చరికగా కాల్పులు జరిపి, హెలికాప్టర్ ద్వారా హెల్‌ఫైర్ క్షిపణిని ప్రయోగించి ఆ ఇరాన్ బోటును దెబ్బతీశాయి. 


More Telugu News