రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

  • చిన్ననాటి స్నేహితురాలు వంశికను పెళ్లాడుతున్న కుల్దీప్
  • ముస్సోరీలో జరిగే వేడుకకు హాజరుకానున్న కోహ్లీ, రోహిత్
  • పెళ్లి కోసం పూర్తిగా బుక్ అయిన ప్రముఖ సావోయ్ హోటల్
  • టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో పెళ్లి పీటలెక్కుతున్న స్పిన్నర్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా రేపు వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఈ హై-ప్రొఫైల్ వివాహం కోసం ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి కోసం హోటల్‌ను మొత్తం బుక్ చేశారు. ఈ హోటల్‌లోని 80 గదులతో పాటు సమీపంలోని ఇతర లగ్జరీ హోటళ్లలో కూడా గదులను రిజర్వ్ చేశారు. అతిథులు, కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది కోసం ఈ భారీ ఏర్పాట్లు చేసినట్లు హోటల్ యాజమాన్యం వెల్ల‌డించింది. రెండు మూడు రోజుల పాటు ఈ హోటల్ ఇతరులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.

కుల్దీప్ యాదవ్, వంశికలది చాలా కాలం నాటి స్నేహబంధం. కాన్పూర్‌లో వీరి కుటుంబాలు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే నివసించేవి. కుల్దీప్ లాల్ బంగ్లా ప్రాంతానికి చెందినవాడు కాగా, వంశిక శ్యామ్ నగర్ వాసి. కుల్దీప్ అండర్-19 ఆడే రోజుల నుంచే వీరిద్దరికీ పరిచయం ఉంది. వంశిక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు. ఆమె మెల్‌బోర్న్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.

గతేడాది జూన్ 4న లక్నోలో వీరి నిశ్చితార్థం సంప్రదాయబద్ధంగా జరిగింది. వాస్తవానికి వీరి వివాహం నవంబర్‌లోనే జరగాల్సి ఉన్నా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో కుల్దీప్ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. ఇటీవల అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకున్న భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్నాడు. టోర్నీలో కొన్ని మ్యాచ్‌లే ఆడినప్పటికీ, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టి తనదైన ముద్ర వేశాడు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే కుల్దీప్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.


More Telugu News