హార్ముజ్ మీదుగా భారత్ వచ్చే నౌకల ప్రయాణంపై ఇరాన్‌తో చర్చించాం: భారత్

  • దేశ ఇంధన భద్రతపై చర్చించినట్లు రణధీర్ జైశ్వాల్ వెల్లడి
  • డీజిల్ సరఫరా కోసం బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడి
  • ముందుగా మన దేశ అవసరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందన్న భారత్
హార్ముజ్ జలసంధి మీదుగా భారత్‌కు వచ్చే నౌకల ప్రయాణం గురించి ఇరాన్‌తో చర్చించామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఆ దేశంతో చర్చించినట్లు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డీజిల్ సరఫరా కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని అన్నారు. శ్రీలంక, మాల్దీవుల నుంచి కూడా ఇదే తరహా అభ్యర్థనలు వచ్చాయని కానీ ముందుగా మన దేశ అవసరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోందని అన్నారు.

ఇరాన్‌లో ప్రస్తుతం సుమారు 9 వేల మంది భారతీయులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇందులో విద్యార్థులు, నౌక సిబ్బంది, వ్యాపారవేత్తలు, యాత్రికులు ఉన్నట్లు తెలిపారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మన రాయబార కార్యాలయం అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందని అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌తో ఘర్షణకు భారత్ కారణమని పాకిస్థాన్ ఆరోపణలు చేయడంపై రణధీర్ జైశ్వాల్ స్పందించారు. పాకిస్థాన్‌వి నిరాధార ఆరోపణలని అన్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై నిందలు వేయడం పాకిస్థాన్‌కు అలవాటే అన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని మండిపడ్డారు.


More Telugu News