Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు
- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం
- 16వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చిన సీబీఐ
- దీనిపై తన లీగల్ టీమ్తో చర్చిస్తున్నానన్న కవిత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్లోని కవిత నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు, ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశారు.
ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ మోపిన అభియోగాలు నిరాధారమని కోర్టు అప్పట్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... ట్రయల్ కోర్టులో ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని ఆదేశించడంతో పాటు, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు కవితకు సమన్లు అందించారు.
ఈ అంశంపై కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ... "ఈరోజు మధ్యాహ్నం సీబీఐ అధికారులు నాకు నోటీసులు అందజేశారు. దీనిపై నా లీగల్ టీమ్తో చర్చిస్తున్నాను. చట్టంపై నాకు నమ్మకం ఉంది. విచారణకు సంపూర్ణంగా సహకరిస్తాను" అని పేర్కొన్నారు.