Gaddam Prasad: 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. పార్టీ ఫిరాయింపు కేసును ముగించిన సుప్రీంకోర్టు
- తెలంగాణలో ఉత్కంఠ రేపిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం
- అన్ని పిటిషన్లను స్పీకర్ పరిష్కరించారన్న న్యాయవాది అభిషేక్ సింఘ్వీ
- స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో విచారణ ముగిసిందని ప్రకటించిన సుప్రీంకోర్టు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించగా... స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఫిరాయింపులపై దాఖలైన మొత్తం 10 పిటిషన్లను స్పీకర్ ఇప్పటికే పరిష్కరించారని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. సదరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చిచెప్పినట్లు ఆయన తెలిపారు. సింఘ్వీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను రెండు రోజుల్లోగా ఫిర్యాదుదారులకు అందజేయాలని ఆదేశించింది. స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో, ఈ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.