'మిత్రధర్మం పాటించకుంటే పొత్తుకు కట్.. కాంగ్రెస్‌కు కూనంనేని అల్టిమేటం

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమన్న కూనంనేని 
  • మార్చి 24న ఇళ్ల పట్టాల కోసం భారీ నిరసన.. చలో అసెంబ్లీ
  • రైతుబంధుపై నిలదీత.. నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
  • జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలని నారాయణ పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రధర్మం పాటించడం లేదని,  ఇదే ధోరణి కొనసాగితే పొత్తును తెంచుకోవడానికి కూడా తాము వెనుకాడబోమని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  తేల్చిచెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం ఉదంతంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనే తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు.

మార్చి 24న 'చలో అసెంబ్లీ'.. ప్రభుత్వానికి డిమాండ్లు ఇవే
రైతుబంధు: రెండు విడతలుగా పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే వేయాలి. ప్రభుత్వం అసలు రైతుబంధు ఇస్తుందో లేదో స్పష్టం చేయాలి.
ఇళ్ల పట్టాలు: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న చలో అసెంబ్లీకి పిలుపు.
సింగరేణి: రాజకీయ జోక్యంతో సింగరేణిని నష్టాల్లోకి నెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.

ప్రజా పోరాటాల్లో జైలుకైనా సిద్ధం: నారాయణ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమాల్లో సీపీఐ ఎప్పుడూ ముందుండాలని పార్టీ సెంట్రల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ పిలుపునిచ్చారు. అవసరమైతే జైళ్లకు వెళ్లడానికి కూడా వెనుకాడకూడదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఇరాన్‌పై దాడులను మోదీ ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేయడంతో పాటు, పార్టీ ఫిరాయింపులను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.


More Telugu News