Kavitha: దీక్ష విరమించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Kavitha Ends Indefinite Hunger Strike After Telangana Govt Assurances
  • వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం నుంచి హామీ రావడంతో దీక్ష విరమణ
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో దీక్ష విరమించిన కవిత, విశారదన్ మహరాజ్
  • నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరవధిక దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి వెలుగుమట్ల బాధితులకు హామీ వచ్చిన నేపథ్యంలో ఆమె తన దీక్షను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విరమించారు.

కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ కూడా దీక్షను విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ఖమ్మంలో సోమవారం రాత్రి నిరవధిక దీక్షను చేపట్టారు. పోలీసులు ఆమెను అడ్డుకుని హైదరాబాద్‌కు తరలించగా, నగరంలో ఆమె దీక్షను కొనసాగించారు.

వెలుగుమట్ల భూదాన్ భూమిలో అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పంపిణీ చేశారు. వెలుగుమట్ల పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 412 మందిని అధికారికంగా గుర్తించి, పట్టాలు ఇచ్చి న్యాయం చేస్తున్నామని అన్నారు. పట్టాలు పొందిన వారు రేపటి నుంచి తమ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కూడా ధైర్యం చెప్పారు. వెలుగుమట్ల అంశంపై ప్రభుత్వం స్పందించడంతో కవిత దీక్ష విరమించారు.

దీక్ష విరమణ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తమ పోరాటం ఆగలేదని, కేవలం విరామం మాత్రమే అన్నారు. వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. మన ఆందోళనలు, వెలుగుమట్ల ఆడపడుచుల నిరసనలతో ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Khammam
Velugumatla
Mallu Bhatti Vikramarka

More Telugu News