Coconut Farmers: ఇరాన్ యుద్ధం ‘కొబ్బరి’కి శాపం

Iran War impacts Coconut Farmers in South India
  • పోర్టుల్లోనే నిలిచిన ఎగుమతులు.. పడిపోయిన ధరలు
  • ఏపీ, తమిళనాడు నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి
  • వెయ్యి కొబ్బరికాయలకు గత నెలలో రూ.20 వేలు పలికిన ధర
  • ప్రస్తుతం రూ.13 వేలకు పడిపోయిందని రైతుల ఆవేదన
అల్లకల్లోలంగా మారిన గల్ఫ్ దేశాల పరిస్థితులు దక్షిణాది కొబ్బరి రైతుల నడ్డి విరుస్తున్నాయి. కొబ్బరి సాగుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక పెట్టింది పేరు. తమిళనాడు, ఏపీల నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల విలువైన కొబ్బరి నిల్వలు ఓడరేవుల్లోనే మూలుగుతున్నాయి. దీని ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మార్కెట్లపై పడటంతో ధరలు భారీగా పతనమయ్యాయి.

రంజాన్ వేళ.. తీరని నిరాశ
సాధారణంగా రంజాన్ మాసంలో కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల్లో కొబ్బరికాయలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఎగుమతిదారులు భారీ ఆర్డర్ల కోసం సరకును సిద్ధం చేశారు. అయితే, యుద్ధం కారణంగా ముంబై, చెన్నై, తూత్తుకూడి పోర్టుల నుంచి వెళ్లాల్సిన కంటెయినర్లు అక్కడే ఆగిపోయాయి. ఈ అనిశ్చితి ఎప్పుడు తొలగుతుందో తెలియక వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

పడిపోయిన ధరలు
గత నెలలో మహాశివరాత్రి సమయంలో కోనసీమ మార్కెట్‌లో కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుత సంక్షోభం ధరలను ఒక్కసారిగా తగ్గించేసింది. గత నెలలో వెయ్యి పచ్చి కాయలు రూ.18,000 నుంచి రూ.20,000 వరకు పలికాయి. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోవడంతో అదే వెయ్యి కాయల ధర రూ.13,000 - 14,000కు పడిపోయింది.

స్థానిక మార్కెట్లే దిక్కు
శ్రీరామనవమి సీజన్‌లో మంచి లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారులకు గల్ఫ్ సంక్షోభం గట్టి దెబ్బే కొట్టింది. విదేశాలకు వెళ్లాల్సిన నాణ్యమైన సరకు పోర్టుల్లో నిలిచిపోవడంతో ఆ నిల్వలను స్థానిక మార్కెట్లలో తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని మార్కెట్ విశ్లేషకుడు అప్పన కాళీప్రసాద్ వెల్లడించారు. యుద్ధం సద్దుమణిగి ఎగుమతులు పునఃప్రారంభమైతే తప్ప కొబ్బరి మార్కెట్ మళ్లీ కోలుకునే సూచనలు కనిపించడం లేదు.
Coconut Farmers
Iran War
Gulf Countries
Coconut Exports
Andhra Pradesh
Tamil Nadu
Kerala
Karnataka
Coconut Prices
Ramzan

More Telugu News