Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం
- అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది
- నాణేల మార్పిడి కోసం నగదును తీసుకెళుతున్నట్టు చెప్పిన వ్యక్తి
- సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ కొనసాగుతున్న వేళ, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది. టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.60 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఉదయం ఒక వ్యక్తి తన కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా, అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారులో దాచి ఉంచిన కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు సదరు వ్యక్తిని నిలదీయగా, తిరుమలలో నాణేల మార్పిడి కోసం ఈ నగదును తీసుకెళుతున్నట్టు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.
అంత భారీ మొత్తానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేదా బ్యాంకు పత్రాలు చూపకపోవడంతో, విజిలెన్స్ అధికారులు నగదుతో పాటు సదరు వ్యక్తిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? దీని అసలు యజమాని ఎవరు? నిజంగానే నాణేల కోసమా లేక ఇతర రాజకీయ లేదా వ్యాపార లావాదేవీల కోసమా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో పలు ఘటనలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఈ భారీ నగదు పట్టుబడటం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది.