పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌ అరెస్ట్‌

  • పీజీ వైద్యురాలు దీపిక మృతి కేసులో ట్విస్ట్.. సీనియర్ డాక్టర్ అరెస్ట్!
  • ప్రేమించి పెళ్లికి నిరాకరించిన అమర్ సహస్‌రెడ్డి
  • ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసుల నిర్ధారణ
  • నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • మరణానికి ముందు రెండు గంటల పాటు ఫోన్ సంభాషణ
  • మత్తు ఇంజక్షన్ తీసుకుని తనువు చాలించిన దీపిక
నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసు కొలిక్కి వచ్చింది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తేలడంతో సీనియర్ డాక్టర్ అమర్ సహస్ రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అమర్ సహస్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దీపిక ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమర్ తన ఎంబీబీఎస్ బ్యాచ్‌మేట్‌తో పెళ్లి నిశ్చయం చేసుకుని దీపికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీపిక మరణించిన రోజు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిగింది. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని, నిన్ను వివాహం చేసుకోలేనని అమర్ తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురైన దీపిక ఆత్మహత్యకు పాల్పడింది.

ఆపరేషన్ థియేటర్లలో రోగులకు మత్తు ఇచ్చే సమయంలో కండరాలు రిలాక్స్ అయ్యేందుకు వాడే ఇంజక్షన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే దీపిక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. అంతకుముందు దీపిక తండ్రి అమర్‌ను ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు కాల్ డేటా, ఇతర ఆధారాలతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.


More Telugu News