రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు

  • రెండున్నరేళ్లుగా సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నానన్న మోత్కుపల్లి నర్సింహులు
  • ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదన్న కాంగ్రెస్ నాయకుడు
  • 200 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. మా జాతి సమస్యలు చెప్పుకుందామని రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ ఆయన దొరకడం లేదని అన్నారు. 200 సార్లు ఫోన్ చేసినా తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం అడుగుదామని ప్రయత్నిస్తే కలవడానికి అవకాశం రావడం లేదని అన్నారు. ఐదు ఎకరాల భూమి ఇస్తే తాము మాదిగ భవనం నిర్మించుకుంటామని తెలిపారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో తమ వర్గానికి అన్ని చోట్ల అన్యాయమే చేశారని ఆరోపించారు.

నిన్న జరిగిన మాదిగల సన్మాన సభకు తనను పిలవలేదని ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి తనను పిలవలేదు కాబట్టి నిర్వాహకులు కూడా పట్టించుకోలేదేమో అని వాపోయారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఎంతకాలమైనా ముఖ్యమంత్రి పదవిలో ఉండు... నిన్ను మా భుజాన మోస్తాం అని రేవంత్ రెడ్డితో చెప్పానని, కానీ ఆయన మాత్రం తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. మాదిగ కులాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోడం లేదని ఆరోపించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, కానీ మాదిగలకు మాత్రం ఒక్కటే ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకు ఎలాంటి కోపం లేదని, కానీ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.


More Telugu News