ట్రంప్ హత్యకు ఇరాన్‌తో కుట్ర.. దోషిగా పాకిస్థానీ

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన కేసు
  • దోషిగా ఇరాన్‌తో కలిసి పనిచేసిన పాకిస్థానీ వ్యక్తి ఆసిఫ్ మర్చంట్ 
  • ఎఫ్‌బీఐ స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా నిందితుడి అరెస్ట్
  • దోషికి జీవిత ఖైదు విధించే అవకాశం  
  • ట్రంప్‌తో పాటు బైడెన్, నిక్కీ హేలీ కూడా టార్గెట్‌గా ఉన్నట్లు గుర్తింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఆదేశాల మేరకు ఆసిఫ్ మర్చంట్ (47) అనే పాకిస్థానీ ఈ కుట్రకు పాల్పడినట్లు ఫెడరల్ జ్యూరీ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్‌ను హత్య చేసేందుకు మర్చంట్ ప్లాన్ చేశాడు. ఈ కుట్ర అమలు కోసం సహాయం కోరుతూ అతడు సంప్రదించిన మరో పాకిస్థానీ వ్యక్తి.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఇన్ఫార్మర్‌గా ఉండటంతో ఈ ప్లాన్ విఫలమైంది.

"ఈ ప్రాణాంతక కుట్రను ఎఫ్‌బీఐ, దాని భాగస్వామ్య సంస్థలు అడ్డుకున్నాయి" అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తీర్పు అనంతరం తెలిపారు. హంతకులను నియమించుకునేందుకు మర్చంట్ ప్రయత్నించగా, ఎఫ్‌బీఐ అధికారులు అండర్‌కవర్ ఆఫీసర్లుగా రంగంలోకి దిగి అతడిని వలపన్ని పట్టుకున్నారు. హత్య చేసేందుకు వారికి 5,000 డాలర్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.

విచారణ సమయంలో, ఇరాన్‌లో ఉన్న తన కుటుంబానికి బెదిరింపులు రావడంతోనే ఈ కుట్రలో పాల్గొన్నానని మర్చంట్ అంగీకరించాడు. ట్రంప్‌తో పాటు అధ్యక్షుడు జో బైడెన్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ పేర్లను కూడా ఐఆర్‌జీసీ సూచించినట్లు అతడు వెల్లడించాడు. 2024 జులైలో అమెరికా విడిచి వెళ్తుండగా మర్చంట్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.


More Telugu News