రూ. 25 వేలకు భారత్-ఇంగ్లండ్ సెమీస్ టికెట్.. ముంబైలో బ్లాక్ మార్కెట్ దందా గుట్టురట్టు

  • భారత్-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్
  • ఒక్కో టికెట్ రూ. 25 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తింపు
  • ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆపరేషన్.. ఒకరి అరెస్ట్
  • నిందితుడి నుంచి 10 ఒరిజినల్ టికెట్లు స్వాధీనం
వాంఖడే స్టేడియంలో జరగనున్న భారత్-ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ రేట్ల కంటే అత్యధిక ధరలకు టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. నిందితుడి నుంచి 10 ఒరిజినల్ మ్యాచ్ టికెట్లను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ముంబైలోని డోంగ్రీకి చెందిన ఓ క్రికెట్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు అభిమాని టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, నిందితుడు టికెట్ రేట్లు రోజురోజుకూ మారుతుంటాయని, ఒక్కో టికెట్‌కు రూ. 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డాక్ యార్డ్ రోడ్ సమీపంలో నగదుతో రావాలని సూచించడంతో, బాధితుడు వెంటనే క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందించారు.

పోలీసులు పథకం ప్రకారం మఫ్టీలో అక్కడికి చేరుకుని నిఘా పెట్టారు. మార్చి 4న డబ్బు తీసుకునేందుకు వచ్చిన కమలుద్దీన్ బామ్నే (51) అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద వివిధ పెవిలియన్లకు సంబంధించిన టికెట్లు లభించాయి. వాస్తవానికి ఈ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 2,500 నుంచి రూ. 4,500 మధ్య ఉండగా, నిందితుడు భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ టికెట్లు నిందితుడికి ఎలా వచ్చాయి, దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




More Telugu News