భారత విద్యార్థులకు కెనడా బంపరాఫర్

  • భారత విద్యార్థుల కోసం కెనడా భారీ స్కాలర్‌షిప్ ఫండ్
  • 100 మిలియన్ డాలర్లతో ఏటా 200 మందికి ఉపకార వేతనాలు
  • టొరంటో యూనివర్సిటీ నిర్వహణలో పూర్తి విద్యా ఖర్చుల చెల్లింపు
  • భారత్‌లో మూడు హైబ్రిడ్ స్టడీ సెంటర్లు, ఇన్నోవేషన్ క్యాంపస్‌ల ఏర్పాటు
  • తిరుపతి ఐఐటీ, ఐసర్‌తో డల్హౌసీ యూనివర్సిటీ భాగస్వామ్యం
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.921.6 కోట్లు) భారీ నిధితో స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఈ ఫండ్ ద్వారా ఏటా 200 మంది ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి కోర్సు పూర్తయ్యేవరకు అయ్యే పూర్తి విద్యా ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నిర్వహిస్తుంది.

ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 'కెనడా-భారత్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ'లో భాగంగా ఈ ఉపకార వేతనాల నిధిని ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యూహంలో భాగంగా భారత్‌లో మూడు ప్రాంతాల్లో హైబ్రిడ్ స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలపై ఈ కేంద్రాల్లో బోధన, పరిశోధనలు జరుగుతాయి. వీటి ద్వారా కెనడా యూనివర్సిటీలు మన దేశంలో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి.

కార్నీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య మొత్తం 13 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో భాగంగా తిరుపతి ఐఐటీ, ఐసర్-తిరుపతి భాగస్వామ్యంతో డల్హౌసీ యూనివర్సిటీ మన దేశంలో ఓ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, మెక్‌గిల్ వర్సిటీలు కూడా భారత్‌లో తమ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను నెలకొల్పనున్నాయి.


More Telugu News